Sunday, October 28, 2012

వైవిధ్యం సరే, వైరుధ్యాల సంగతేమిటి? (18-10-2012)

హైదరాబాద్‌లో రెండు వారాలుగా అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు జరుగుతున్నది. మాబోటి వాళ్లకు వెళ్ళాలని కూడా అనిపించలేదు. ఈ సదస్సు కు హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సీసీఎంబీని ఆహ్వానించలేదు. దేశం గర్వించే శాస్త్రవేత్త పీఎం భార్గవను కూడా పిలవలేదు. ఇది చాలు సద స్సు దశ, దిశను తెలుసుకోవడానికి. మూడు, నాలుగు దశాబ్దాలుగా అంతర్జాతీయ సదస్సులు చర్చించే అంశాలు, చర్చిస్తామని చెప్పే అంశాలు, చెప్పి, చర్చించే అంశాలకు వాస్తవంలో ఈ సదస్సుల వెనక ఉండే ఆర్థికశక్తుల ఆచరణకు ఏం సంబంధం ఉండదు. నిజానికి ఆచరణ దిగజారి ప్రపంచం విధ్వంసానికి గురవుతున్నప్పుడు, సామాన్య ప్రజలు, మధ్య తరగతి తమ అనుభవాన్ని అవగాహన చేసుకుంటున్న సందర్భంలో మన మనసులోని మాటలను ఈ సదస్సులే చర్చిస్తాయి. దాంతో వ్యవస్థ మీద కొత్త ఆశలను కొత్త విశ్వాసాలను కలిగిస్తాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మూడవ ప్రపంచం అనబడే దేశాలలో అప్పుడే స్వాతంత్య్ర ఆకాంక్ష మొలకెత్తుతున్న రోజుల్లో అంతర్జాతీయ మానవ హక్కుల రూపకల్పన జరిగింది. ఇక రాబోయే ప్రపంచం మానవహక్కుల పునాది మీద నిలబడి రాజ్యం ప్రజలకు బాధ్యత వహించి స్వేచ్ఛాయుత ప్రపంచ నిర్మాణం జరుగుతుందన్న ఆశను కల్పించారు. ఆరు దశాబ్దాల తర్వాత మానవ హక్కుల స్థానంలో ‘టెపూరరిజం’ చర్చకు వచ్చి దాన్ని ఎదుర్కొనడానికి రాజ్యమే ఒక టెర్రరిస్టుగా మారింది. ఈ దుమారంలో మానవహక్కుల ప్రమాణాలు ఎక్కడ కొట్టుకుపోయాయో తెలియదు. ఈ విధ్వంసం అగ్రభాగాన అమెరికా ఉంది. 1960వ దశాబ్ద చివరిలో ప్రపంచ వ్యాప్తంగా నిరసన జ్వాలలు పెరిగి, యువత కొత్త ప్రత్యామ్నాయాలు వెతుకుతున్న తరుణంలో 1967లో టెహ్రాన్‌లో అంతర్జాతీయ మాన వ హక్కు ల సదస్సు జరిగింది. ఆ సదస్సులో ప్రధానంగా యువత పాత్ర మీద, అలాగే కూలిపోతున్న కుటుంబ వ్యవస్థ మీద పెద్ద చర్చ జరిగింది. మళ్లీ 1990లో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత, కమ్యూనిజం వైఫల్యం చెందడానికి కారణాలను వెతుకుతూ వ్యక్తి స్వేచ్ఛను, మానవ హక్కులను గౌరవించకపోవడం వల్లేనని తేల్చేందుకు 1993లో వియన్నా లో రెండవ అంతర్జాతీయ మానవ హక్కుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో పెట్టుబడిదారీ దేశాల్లో ప్రజ లు స్వేచ్ఛగా జీవిస్తున్నారని, రాజ్యం కేంద్రంగా జరిగే అభివృద్ధి నియంతృత్వానికి దారి తీస్తుందని, రాజ్యానికి ప్రత్యామ్నాయం మార్కె అంటూ, మరి సంక్షేమం మాటేమిటి అంటే వాటిని ఎన్జీవోలకు అప్పజెప్పాలనే దిశగా చర్చలు జరిగాయి. బహుశా అంతకు ముందు ఎన్నడూలేని విధంగా ఈ సదస్సులో ఎన్జీవోలకు భాగస్వామ్యం కల్పించారు. అలాగే మహిళల సాధికారత మీద, ఆదివాసీల హక్కుల మీద, జాతి వివక్ష మీద అంతర్జాతీయ సదస్సులు జరిగాయి. నిజానికి గత అరవై ఏళ్లలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో మానవ హక్కులకు సంబంధించి దాదా పు వంద ఒప్పందాలు, ప్రకటనలు చేయడమే కాక, కొత్త ప్రమాణాలు నిర్ధారించబడ్డాయి. అంతిమంగా ఈ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఐక్యరాజ్య సమితిని నిర్వీర్యం చేసి, దానిమాట వినే నాథులే లేకుండా చేశారు. పర్యావరణం మీద కూడా చాలా సదస్సులే జరిగా యి. అందులో 1990లలో ఈఅంశం మీద చాలా పెద్ద చర్చే జరిగింది. అప్పుడే ఎజెండా 21 అని 21వ శతాబ్దపు అజెండా ఒకదాన్ని అంగీకరించారు. ఈ సదస్సు నయా ఆర్థిక విధానం విస్తరణ క్రమంలో జరిగింది. పర్యావరణాన్ని విధ్వంసం చేసే ప్రక్రియను పెంచి, అది పెంచుతున్న వాళ్లే సదస్సుకు కావలసిన వనరులను కూర్చి, చర్చలను ప్రోత్సహిస్తుంటారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సద స్సు, ప్రపంచ ‘వాతావరణం’ మారి మానవ మనుగడే ప్రమాదం అని ఒకవైపు అంటూ ఉంటే, అమెరికా, కొన్ని యూరప్ దేశాలు తమ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి అణు రియాక్టర్లను అమ్ముతున్నారు. ఒకవైపు అణువిద్యుత్ ఉత్పత్తికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతుంటే, హైదరాబాద్‌లో జీవవైవిధ్య సదస్సు జరగడం ఎంత విచిత్రం! ఈ సదస్సుకు ఎవరిని పిలిచారో, ఏం చర్చిస్తున్నారో మీడియా పూర్తిగా బయట కు తీసుకరావడం లేదు. ‘హిందూ’ లాంటి పత్రికలు షర్మిలా పాదయావూతను పతాక శీర్షికగా వేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పర్యావరణం మీద తీవ్రమైన చర్చ జరపవలసిన జాతీయ మీడియా, మమత బెనర్జీ మతిలేని మాటల మీద, అరవింద్ కేజ్రీవాల్ మీద, ప్రియాంక గాంధీ భర్త మీద ఎడతెగని చర్చలు జరుపుతున్నారు. నిజానికి ఈ మూడు వారాలు అభివృద్ధి నమూనా మీద, నయా పెట్టుబడిదారీ వ్యవ స్థ మీద, పెట్టుబడిదార్ల అత్యాశ మీద, పెరుగుతున్న వస్తు వ్యామోహం మీద, భవిష్యత్ తరాల పట్ల బాధ్యత మీద జరగవలిసి ఉండే. కానీ ఈ పెడ ధోరణుల వెనక ఉండే శక్తుల చేతిలోనే మీడియా ఉంది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సదస్సు ఈ ప్రాంతంలో నడుస్తున్న ఒక మహత్తర పోరాట కాలంలో జరుగుతున్నది. ఆ పోరాటంలో భాగమైన తెలంగాణ జర్నలిస్టులను ప్రధానమంత్రి ప్రసంగానికి రానివ్వలేదు. నిర్వాహకులకు ప్రజల పట్ల బాధ్యత ఉన్నా లేదా జీవరాసుల మీద ప్రేమ ఉన్నా, ఒక అర్ధ శతాబ్దం కింద హైదరాబాద్ నగరం ఎలా ఉండేదో, ఎన్ని చెరువులు, ఎన్ని పక్షులు, ఎన్ని పాములు, ఎన్ని పురుగులు, ఎన్నిపూలు, ఎన్ని పార్కులు ఉండేవో చూపించి, తర్వాత ఇప్పటి బోసిపోయిన హైదరాబాద్‌ను,దాని కేంద్రంగా నడుస్తున్న ఒక ప్రాంతీయ ఉద్యమా న్ని, అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్న గిరిజన, బలహీనవర్గాల ఉద్యమాన్ని, రైతుల ఆత్మహత్యలను మొత్తంగా చర్చిస్తే ప్రపంచం, పర్యావరణం, దాని విధ్వంసం ఎలా జరిగిందో కళ్లకు కట్టినట్టుగా, బుద్ధుడికి జ్ఞానోదయమైనట్టుగా ఉండేది. కార్యకారణాలు తెలిశాయి. బుద్ధుడు కూడా మానవుడి వేదనకు కారణం పెరుగుతున్న కోరికలే అని 2500 సంవత్సరాల కిందట విశ్లేషించాడు. ఈ నగరంలో ఉండే అందమైన, అద్భుతమైన గుట్టలు, గుట్టల మీద మనుషుల్లో లేదా ఎవరో అర్కిటెక్ట్ అమర్చినట్టు తోచే రాతి వరసలు ఏమయ్యాయి? అబ్దుల్ కలాం తన ఆత్మకథలో హైదరాబాద్ (బిల్డర్స్)రాళ్ల నిర్మాణం మీద ఉండే తన మమకారాన్ని గురించి రాసుకున్నాడు. బంజారా,జూబ్లీహిల్స్‌ను ఎవరు ఆక్రమించుకున్నారు? లగడపాటి, కావూరి, నార్నెల పేర్లు ఈ గుట్టలకు ఎవరు పెట్టారు? గుట్టలు గుట్టలే వ్యక్తుల సొంత ఆస్తి కావడమేమిటి? అందమైన నౌబత్‌పహాడ్ మీద బిర్లాకు ఆధిపత్యం ఎలా వచ్చింది? మౌలికంగా ప్రశ్న అడగాలంటే ప్రకృతి ఎవరికి చెందిం దితైపకృతి మీద మనిషి ఆధిపత్యాన్నే ప్రశ్నిస్తున పర్యావరణ ఉద్యమాలుండగా, ప్రైవేట్ వ్యక్తులకు ప్రకృతి వనరుల మీద ఆధిపత్యమేమిటి అనే ప్రశ్న కూడా అడగా లి కదా? సదస్సు స్పృహలో ఈ ప్రశ్నలుండి ఉండవు. ఉండడానికి వాళ్లకంటూ ఒక ప్రాపంచిక దృక్పథం ఉండాలి కదా. సదస్సు జరుగుతున్న స్థలానికి రాయివిసిరితే, లేదా కూతకూస్తే వినేంత దూరం లో విజయభాస్కర్‌డ్డి బొటానికల్ గార్డెన్ ఉంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న కాలంలోనే మేం చూస్తూ చూస్తూనే ఈ మొత్తం గార్డెన్‌ను రాజశేఖర్‌డ్డి ప్రభుత్వం ఒక ప్రైవేట్ వ్యక్తికి ‘ఇకో టూరి జం’ పేర నజరానా ఇచ్చింది. ఇక్కడ ఏడు నక్షవూతాల హోటల్ కడ్తారట. మా కళ్ల ముందే వందల చెట్లను నరికేశారు. ఈపార్కులో స్వేచ్ఛ గా తిరుగుతూ నాట్యం చేసే నెమళ్లు అనాథలయ్యాయి. అవి ఎక్కడికి పోవాలో తెలియక ఎత్తైన గోడలను దాటడం నేర్చుకున్నాయి. కొన్ని నెమళ్లు న్యాయాన్ని వెతుకుతూ హైటెక్ భవనం చేరుకున్నాయి. చివరికి పార్కులో ఉదయం నడక కోసం వెళ్తున్న వాళ్లంతా ఒక అసోసియేషన్ పెట్టుకుని, హైకోర్టుకు వెళితే, విధ్వంసం తాత్కాలికంగా ఆగింది. అలాగే అందమైన హుస్సేన్‌సాగర్ ఆక్రమణకు గురై అక్రమ కట్టడాలు వెలిశాయి. దీన్ని రక్షించాలని సుప్రీంకోర్టులో కేసు వేస్తే తాత్కాలికంగా స్టే వచ్చింది. ఈ నగరంలో జీవవైవిధ్య సదస్సు పెట్టి హైదరాబాద్‌కు జీవవైవిధ్యంలో పాస్ మార్కులు వచ్చాయని ముఖ్యమంత్రి, మేయర్ ఆనందపడిపోతున్నా రు. కానీ 90 మార్కులకు దాదాపు 90మార్కులు వచ్చే నగరం 30మార్కుల స్థాయికి దిగజారడానికి కన్నీళ్లు పెట్టుకోవాలి కదా? నిజానికి జీవ వైవిధ్య సదస్సు చర్చించవలసిన తాత్విక, చారివూతక ప్రశ్నలు చాలా మౌలికమైనవి. ఒక టి; ప్రకృతికి మనిషికి ఉండే సంబంధమేమిటి? ప్రకృతి శక్తులతో మనిషి పోరాటం చేసిన మాట నిజమే. ప్రకృతిని పూజించే మనిషే, ప్రకృతి మీద కొన్ని విజయాలు సాధించిన మాట కూడా నిజమే. మనిషికి ప్రకృతికి గతంలో ఉండేది స్నేహపూరిత వైరుధ్యమే. దాన్ని శత్రుపూరిత వైరుధ్యంగా మార్చిన పెట్టుబడిదారుల ప్రయోజనాల నేపథ్యంలో జరిగే సదస్సు, ప్రకృతిని ఎలా ప్రేమించగలదు? ప్రకృతిని పూర్తిగా నాశనం చేసే దాకా ‘విక్షిశాంతి’ తీసుకునేట్టు లేదు. నిజానికి నిజాయితీ ఉంటే సదస్సు ఈ దోపిడీ వ్యవస్థ మీద యుద్ధమే ప్రకటించాలి. ప్రకృతిలోని వైవిధ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని వైరుధ్యాలను పరిష్కరించడం అనివార్యం. దీంట్లో ప్రకృతి మనిషి మధ్య వైరుధ్యమే కాక, పెట్టుబడికి ప్రకృతికి, అలాగే సామ్రాజ్యవాద దురాశకు అడవికి (అడవిలోని వనరుల) మధ్య ఏర్పడిన వైరుధ్యాన్ని ఎదుర్కొవాలి. మన దేశంలో అట్టడుగున, అతి నిరాడంబరంగా బతుకుతున్న గిరిజనులు సహజ వనరులను, ప్రకృతి సంపదను, అడవిలోని జీవరాసుల సంరక్షణ కోసం పోరాడుతున్నారు. అలాగే ప్రజాస్వామ్యవాదులు ప్రకృతి విధ్వంసానికి కారణమయ్యే ప్రాజెక్టులకు, పరిక్షిశమలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. గంగానదిని కాపాడడానికి నిరంతరంగా ఓ పోరాటం జరుగుతుంది. మనదేశం, ముఖ్యంగా హిందూమతం చాలా విచివూతమైన మతం. ప్రతిదినం సాయంత్రం గంగానదికి పెద్ద ఎత్తున హారతి ఇస్తుంటారు. ఈ పూజించడం దశాబ్దాలుగా జరుగుతున్నది. కానీ సంగీతం, నాట్యం, ఆ దీపాల వెలుగులోనే నేను చిన్నతనంలో చూసిన స్వచ్ఛమైన గంగానది ఒక డ్రైనేజీ కాలువగా మారిపోయింది. కలుషితమైన నీళ్లను కూడా పూజిస్తూనే ఉన్నారు. హారతి పడుతూనే ఉన్నారు. ఇది వైవిధ్యమా? లేక వైరుధ్యమా? సదస్సు ఈ ప్రశ్నకు జవాబు వెతకడం లేదు. పరిష్కారానికి మార్గం అసలే వెయ్యడం లేదు. అయినా ఇలాంటి సదస్సులు ఒక భ్రమాజనిత విశ్వాసాన్ని కలిగించడానికి ‘ప్రకృతి విధ్వంసకారులు’ వీటికి ఆతిథ్యం కల్పించి ఆనందపడుతూనే ఉంటారు. విధ్వంసాన్ని ప్రశ్నించనంత కాలం ప్రశ్నలకు సమాధానాలు లేని ఇలాంటి సదస్సులు జరుగుతూనే ఉంటాయి.

No comments:

Post a Comment